పేరుకే ఓబుళాపురంపై సిబిఐ దర్యాప్తు: బాబు
ఓబుళాపురం గనుల లీజును రద్దు చేయాలని, మైనింగ్ కార్యకలాపాలను నిలిపేయాలని, అక్కడి ముడి ఇనుమును స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబుళాపురం గనులకు సంబంధించిన పత్రాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల ఆ ఫైళ్లను స్పీకర్ వద్ద పెట్టాలని డిమాండ్ చేశామని ఆయన చెప్పారు. సిబిఐ దర్యాప్తును వైయస్ జగన్ తో పాటు గాలి జనార్దన్ రెడ్డి కూడా ఆహ్వానించారని, అయితే ఓబుళాపురం మైనింగ్ కు సంబంధించిన డబ్బులు ఎక్కడికెళ్లాయనేది తేలాలని చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. రాష్ట్ర సరిహద్దులు కూడా మార్చివేశారని, గ్రామాల సరిహద్దులు మార్చేశారని ఆయన ఆరోపించారు. ఇతర మైనింగ్ కంపెనీలను బెదిరించి తమలో కలిపేసుకున్నారని ఆయన ఆరోపించారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఓబుళాపురంపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు.