బాలు గాత్రంతో ఉప్పొంగిన విశాఖ సంద్రం
తొలుత ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజలు 'నాధవినోదం నాట్యవిలాసం' అనే పాటతో స్వరాభిషేకాన్ని ప్రారంభించారు. అనంతరం కిన్నెరసాని వచ్చిందమ్మా అంటూ ఉక్కు వాసులను ఓలలాడించారు. బాలసుబ్రహ్మణ్యం తన సినీ జీవితంలో పాడిన మరుపురాని గీతాలైన మల్లెలు పూసే వెన్నెలు కాసే..., ఓ పాపాలాలి జన్మకేలాలి..., చినుకులారాలి వంటి ఆణిముత్యాలను గీతామాధురితో కలసి పాడారు. శ్రీకృష్ణ, గీతా మాధురి, కృష్ణ చైతన్యలు కుర్రాకారుకు ఊపుతెచ్చే ఓం నమస్తే బోలే బేబి, అబ్బో నేరేడుపళ్లు అబ్బాయి కళ్లు వంటి గీతాలను పాడి ఉక్కు వాసులను ఉషారెత్తించారు.
కార్యక్రమాన్ని ఉక్కు ఉన్నతాధికారులు, ప్రముఖ గాయనీ బినాగ్ మసాని, సౌత్ ఎసిపి ఖాన్లు ఆధ్యంతం తిలకించారు. కార్యక్రమాన్ని క్లబ్ కార్యదర్శి ఆర్ గోపాలరావు, సహాక కార్యదర్శి ఎల్ శ్రీనివాసులు, కోశాధికారి తుషార్ అగర్వాల్, సభ్యులు ఆర్ శ్రీనివాసులు, విఎస్ఆర్ కోటయ్య, మధుసూదన్, కె రాజగోపాల్ నాయుడు, బి అక్కునాయుడు, ఎకె పాత్రో, వెంకటరాజు, వెంకటేశ్వరరావులు నిర్వహించారు.