నూతన జంట ఆత్మహత్య మిస్టరీ
మంగళవారం రాత్రి వంట గదిలోగల ఇనుప దూలానికి ఉరి వేసుకుని మృతి చెందారు. రాత్రి ఒంటిగంట సమయంలో పసివాడు గుక్కపట్టి ఏడుస్తుండడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా, దంపతుల మృతదేహాలు దూలానికి వేలాడుతూ కనిపించాయి. వీరు చనిపోయిన ప్రదేశంలో నరసింహారెడ్డి స్వదస్తూరితో రాసిన మరణ వాంగ్మూలం లభించింది. తమ చావుకు ఎవరూ కారకులు కాదని, కేవలం మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొని ఉంది. 'నా కుమారుడికి అన్యాయం చేయకండి.. నా దగ్గర ఉన్న డబ్బులు, పొలం కాగితాలు మా నాన్నకు అప్పగించండి... వారికి అన్యాయం చేసి వెళ్తున్నాను' అని కూడా నరసింహారెడ్డి అందులో పేర్కొన్నాడు.
అన్యోన్యంగా ఉంటున్న వీరు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి గ్రామస్తులు అయోమయానికి లోనయ్యారు. పెద్దగా స్థితిమంతులు కాకున్నా ఉన్నంతలో పొందికగా జీవనం సాగిస్తూ, నలుగురితో కలివిడిగా ఉంటున్నారు. నరసింహారెడ్డి పెళ్లయిన తరువాత ఓ ఇల్లు నిర్మించుకున్నాడు. ఆర్థికంగా స్థిరపడుతున్నాడు. త్వరలోనే కారు కొనుగోలు చేసి సొంతంగా కిరాయిలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు. కొత్త సంవత్సరంలో కారు కొంటానని బంధువులు, స్నేహితులతో అంటుండేవాడు. ఈ నేపథ్యంలో నరసింహారెడ్డి దంపతులు ఆత్మహత్య చేసుకోవడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
నరసింహారెడ్డి పక్షంరోజుల క్రితం లారీపై డ్యూటీకి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండడం ఇష్టంలేని భవాని బిడ్డతో సహా పుట్టింటికి వెళ్లింది. మూడురోజులక్రితం డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన నరసింహారెడ్డి నేరుగా అత్తగారింటికి వెళ్లి అక్కడే రెండు రోజులు సరదాగా గడిపాడు. మంగళవారం రాత్రి భార్య, బిడ్డను తీసుకుని తన ఇంటికి వచ్చాడు. కొన్ని గంటలకే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి బలవన్మరణానికి కారణాలేమిటన్నది అంతుబట్టడం లేదు. నరసింహారెడ్డికి కొంతకాలంగా తండ్రితో నెలకొన్న ఆర్థికపరమైన లావాదేవీలే దంపతుల ఆత్మహత్యకు దారితీసి ఉండవచ్చని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల మృతితో తొమ్మిది నెలల పసికందు అనాధగా మారాడు.