అర్థరాత్రి కె చంద్రశేఖర రావు తరలింపులో హైడ్రామా
బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి నుంచి హైదరాబాదుకు తరలించింది. ఈ వాహనాన్ని మీడియా వెంబడించినా దృశ్యాలను పట్టుకోవడంలో విఫలమైంది. తాను అరెస్టయిన మరుక్షణం నుంచి హైదరాబాదుకు తరలించాలని కెసిఆర్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. హైదరాబాద్ కు తరలించాలనే తన సూచనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యక్తిగత వైద్యుడు గోపీనాథ్ తప్పుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మంలో కెసిఆర్ తో మాట్లాడడానికి ప్రయత్నించారు. అయితే మర్యాదపూర్వకంగా కెసిఆర్ వెంకటరెడ్డితో మాట్లాడారు తప్ప చర్చలకు అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేనప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని కెసిఆర్ చెప్పారు. అయితే, వెలుపలికి వచ్చిన మంత్రి కెసిఆర్ ఆరోగ్యం భేషుగ్గా ఉందని కితాబు ఇచ్చారు. కెసిఆర్ తానే స్వయంగా పండ్ల రసం తీసుకుని దీక్ష విరమించారని చెప్పారు.