ఆంధ్రులపై తెలంగాణ దాడులకు జర్నలిస్టుల నిరసన
ఈ సందర్భంగా శ్రీరాంయాదవ్ మాట్లాడుతూ గత 54 సంవత్సరాలుగా ఆంధ్రరాష్ట్రాన్ని పాలించింది తెలంగాణా నాయకులేనని, ఆర్ధికంగా వెనుకబడి ఉన్న తెలంగాణాను అభివృద్ధి పరించింది ఆంధ్రులేనన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న తెలంగాణా వాదులు సామరస్యంగా తమ పోరాటాన్ని కొనసాగించాలని, తమ సమస్యలతో ఆంధ్రులపై దాడులు చేయడం హేయమైన చర్యని అన్నారు.
ఇప్పటి వరకు ఆంధ్ర ఎన్నో విధాలుగా నష్టపోయిందని, ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మాణానికి నోచుకోలేదని, ఎంతమంది నాయకులు వచ్చినా తెలంగాణానే అభివృద్ధి చేశారు తప్ప ఆంధ్రకు ఎటువంటి న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ తన ఉనికిని కాపాడుకోవడానికే తెలంగాణలోని అమాయక ప్రజలను, విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, ఆసుపత్రిలో ఉన్నా ఆరోగ్యంగానే ఉన్నారని, కెసిఆర్ ఎత్తుగడలు ఇకనుంచి చెల్లనివ్వమని శ్రీరాంయాదవ్ హెచ్చరించారు.
శాంతియుతంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తే తాము కూడా మద్దతిస్తామని, హింసాయుతంగా కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. వార్త విలేకరి మన్నే మహీధర్ ముఖర్జీ మాట్లాడుతూ కెసిఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని, ఇప్పటి వరకు శాంతంగా ఉన్న ఆంధ్రులను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొని కెసిఆర్కు వ్యతిరేకంగాను, తమకు ప్రత్యేక ఆంధ్రాను కేటాయించాలని నినాదాలు చేశారు. తొలుత మహాత్మా ఆంధ్రులను కాపాడు అనే వినతిపత్రాన్ని మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఉంచారు.