ప్రియుడి మోజులో గజదొంగగా మారిన మాయలేడీ
ఈ ముఠా అమ్మిన ఐదు మోటారు సైకిళ్ల ఆచూకీ పోలీసులకు చిక్కింది. ఇప్పటికే రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం విజయవాడలోని విశాలాంధ్ర రోడ్డులో ఉండే యక్కల భవానీకి అక్కడ ఓ ఇంటర్నెట్ కేఫ్ ఉంది. మాచవరానికి చెందిన తాండ్ర మహేష్కుమార్ ఇంటర్నెట్కు వెళుతూ క్రమంగా దాన్ని లీజ్కు తీసుకున్నాడు. క్రమేణా వీరిద్దరూ సన్నిహితంగా మెలగడంతో భవానీని అనుమానించిన భర్త వీరిపై ఓ కన్నేసి ఉంచాడు. తరచుగా కుమార్ ఎక్కడకు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ వెంబడించి తెలుసుకునేవాడు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన భవానీ మోటారు సైకిల్ లేకుంటే భర్త తమ వెంట పడడని భావించి డూప్లికేట్ కీతో ఆయన మోటార్ సైకిల్ను అపహరించమని మహేష్కుమార్కు చెప్పింది. ఆమె సలహాతో మోటార్సైకిల్ దొంగిలించిన మహేష్ ఆ బండిని పదిహేను వేలకు అమ్మాడు. ఆ డబ్బులతో జల్సా చేసిన ఇద్దరూ క్రమంగా మోటారు సైకిళ్ల దొంగతనాలకు అలవాటు పడ్డారు. విజయవాడలో ఐదు మోటారు సైకిళ్లు అపహరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మోటారు సైకిళ్ల దొంగతనాల్లో వీళ్లకు వెంకటేష్, అనిల్, కిరణ్ అలియాస్ కిషోర్ అనే ముగ్గురు సహాయపడ్డారు. దొంగిలించిన మోటారు సైకిళ్లను భవానీ తన స్వగ్రామమైన అనంతపురం జిల్లా కదిరిలో బంధువుల ద్వారా అమ్మిస్తోంది. విజయవాడ చిట్టినగర్కు చెందిన అనిల్ దొంగిలించిన వాహనాలకు కంప్యూటర్ ద్వారా నకిలీ ఆర్సీ బుక్ తయారుచేసి ఇవ్వగా, వెంకటేష్, కిరణ్ ఆ వాహనాల ఛాసిస్ నంబర్లను మార్చేవారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం బ్యారేజ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్సై రాజశేఖరరెడ్డి ఏపీ 16 ఏహెచ్ 8622 నంబర్ పల్సర్ వాహనాన్ని ఆపారు. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సరిగానే ఉన్నాయి. అయితే వాహనంపై ప్రయాణిస్తున్న పెనుమాకకు చెందిన కొల్లి సురేష్ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. దాంతో ఛాసిస్ నంబర్ కూడా తనిఖీ చేస్తే అదికూడా సరిగానే ఉంది. అప్పటికీ అనుమానం తీరని ఎస్సై ఏపీ పోలీస్ ఇంటర్నెట్ పోర్టల్కు వాహన నంబర్ ఎస్ఎంఎస్ చేసి, వివరాలు తెప్పించారు. దానితో బండి చోరీ అయిందన్న విషయం బయటపడింది.
సత్యనారాయణపురానికి చెందిన అల్లం కుమార్ వెంకటేష్, మాచవరానికి చెందిన తాండ్ర మహేష్లను పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితురాలైన భవానీతో సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్సై రాజశేఖరరెడ్డి తెలిపారు.