చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: ఒయు జెఎసి
చంద్రబాబే తెలంగాణ న్యాయవాదులపై కార్యకర్తలను దాడికి ఉసిగొల్పారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావు విమర్శించారు. ప్రజాస్వామ్యబద్దంగా తెలంగాణపై వైఖరి చెప్పాలని చంద్రబాబును అడినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తులు, గుండాలు దాడి చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలను ఆపడానికి కూడా ప్రయత్నించలేదని ఆయన అన్నారు. న్యాయవాదులపై దాడిని తెలంగాణ జెఎసి ఖండించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే అధికారం ప్రతి ఒక్కరికీ ఉందని జెఎసి అన్నది. జరిగిన సంఘటన మంచిది కాదని, జరగాల్సి ఉండింది కాదని తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. న్యాయవాదులకు ఆయన క్షమాపణ చెప్పారు.
ధరల పెంపునకు నిరసనగా తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తులు వారిపై దాడి చేశారు. సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు న్యాయవాదులపై దాడి చేశారని తెరాస నాయకుడు కెటి రామారావు అన్నారు.