మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ప్రస్తుత రూపంలో బిల్లును అడ్డుకునేందుకు మద్దతు ఉపసంహరణ ఆయుధాన్ని బయటికి తీసిన సమాజ్వాది, ఆర్జేడీ, జేడీయూ అధినేతల ప్రయత్నాలకు ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలు లొంగలేదు. ఒక్క తృణమూల్ మినహా యూపీఏలోని భాగస్వామ్య పక్షాలన్నీ బిల్లుకు మద్దతు తెలిపాయి. వాటికి ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం, సీపీఐ, అన్నాడీఎంకే, టీడీపీ తదితర పార్టీలు జత కలిశాయి. పెద్దల సభలో మునుపెన్నడూ లేని విధంగా సమాజ్వాది, ఆర్జేడీ, ఎల్జేపీలకు చెందిన ఏడుగురు సభ్యులను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంత వరకూ సస్పెండ్ చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన చట్టం తరహాలోనే ఒక చట్టం తీసుకువచ్చి మహిళలకు కేటాయించే సీట్లను ఎంపిక చేస్తామని కేంద్ర న్యాయ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చకు రాజ్యసభలో ఆయన సమాధానమిచ్చారు. ఓబీసీ, మైనారిటీ, ఎస్సీ/ఎస్టీ మహిళలకు రిజర్వేషన్పై మాట్లాడుతూ 1935 తర్వాత కులాల ఆధారంగా జనాభా గణన లేదని గుర్తు చేశారు.