వైయస్సార్ స్కీమ్స్ అనుచితం
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మేడిపండు మాదిరిగా తయారైందని ప్రణాళికా సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ వ్యాఖ్యానించారు. తెల్ల రేషన్ కార్డులు అత్యధిక సంఖ్యలో ఉండడాన్ని ప్రస్తావిస్తూ - "మీ రాష్ట్రంలో 80 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులున్నాయి. అంటే దారిద్య్ర రేఖ ఎగువన ఉన్నది కేవలం 20 శాతమేనా?'' అని సేన్ ప్రశ్నించారు. ఆహార భద్రత కోసమే ఇలా ఇచ్చినట్టు రాష్ట్ర అధికారులు సమర్థించుకున్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలు చేయడాన్ని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ఆమర్త్యసేన్ సమర్థించడాన్ని గుర్తుచేశారు. "అయితే జనాభాలో 80 శాతం మంది పేదలున్న రాష్ట్రం, దేశంలోనే అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఇది ఎలా సాధ్యం?'' అని సేన్ ప్రశ్నించారు.
రైతులకు ఉచిత విద్యుత్తు మొదలుకుని ఇన్పుట్ సబ్సిడీ వరకు, పింఛన్ల నుంచి ఆరోగ్య శ్రీ వరకు, తెల్ల రేషన్ కార్డుల నుంచి పరిశ్రమలకు కరెంటు సబ్సిడీ వరకు, పావలా వడ్డీ మొదలుకుని రుణాల రద్దు వరకు వైఎస్ హయాంలో చేపట్టిన ప్రతి జనాకర్షక పథకాన్నీ సేన్ ఎత్తి చూపారు. ఈ పథకాలన్నీ రాజకీయంగా జనాకర్షకమైనవి కావచ్చు కానీ అందుకు చెల్లించిన మూల్యం ఎంత అని ఆయన నిలదీశారు. ప్రతిదాన్నీ ఉచితంగా అందించడం ద్వారా మీరు వ్యవస్థల్ని నాశనం చేయడం లేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సమర్థించేందుకు చీఫ్ సెక్రటరీ పలుమార్లు జోక్యం చేసుకుని వివరణ ఇచ్చినట్టు తెలిసింది.
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు, ఇతర సబ్సిడీలను కూడా ఆయన వ్యతిరేకించారు. "రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా మంచి వానలు పడ్డాయి. పంటల దిగుబడి బాగా పెరిగింది. వ్యవసాయ వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు రైతులకు పావలా వడ్డీ, రుణాల రద్దు, ఇన్పుట్ సబ్సిడీ వంటి రాయితీలు ఇవ్వడం ఎందుకు? కరువు లేదా పంటల దిగుబడి సరిగా లేనపుడే కదా ఇలాంటి వెసులుబాట్లు ఇవ్వాల్సింది? అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఇలా భారీ మొత్తాల్లో అనుత్పాదక వ్యయం చేయడం ఎంతవరకు సమర్థనీయం'' అని సేన్ నిలదీశారు. ప్రణాళిక సంఘానికి చెందిన మరో సీనియర్ అధికారి, ఉచిత విద్యుత్తుపై తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు.