వరంగల్ జిల్లాలో మళ్ళీ 'ప్రత్యేక' సెగలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం హోమం, విజయ యాగాలు నిర్వహించారు. జెఎసిల ఆధ్వర్యంలో జిల్లా అంతటా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. వర్ధన్నపేటలో స్థానిక అర్చకులు జెఎసి ఆధ్వర్యంలో తెలంగాణ శాంతి హోమం నిర్వహించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ తెలంగాణ ఉద్యమ కో-ఆర్డినేటర్, టీఆర్ ఎస్ నాయకుడు మరుపల్లి రవి ఆధ్వర్యంలో ఉర్సులో తెలంగాణ కోసం విజయయాగం, దేవయాగం కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు శక్తిని ప్రసాదించాలని, శ్రీవికృతి నామ సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడాలని యాగంలో పూజలు నిర్వహించారు.
దేవరుప్పులలో జెఎసి రిలే నిరాహార దీక్షలు 82వ రోజుకు చేరుకున్నాయి. బచ్చన్నపేటలో చేపట్టిన దీక్షలు 80వ రోజుకు, జనగామ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని నర్మెట, లింగాలఘణపురం, రఘునాథపల్లి, బచ్చన్నపేట, చేర్యాల, దేవరుప్పుల మండలాల్లో రిలే నిరాహార దీక్షలు విస్తృతంగా కొనసాగాయి. మహబూబాబాద్, కేసముద్రం, భూపాలపల్లి, నర్సం పేట, పరకాలలో రిలే దీక్షలు నిర్వహించారు. సూర్యాపేట రోడ్డులో తెలంగాణ ఉద్యమకారులు రాస్తారోకో చేపట్టారు. హన్మకొండలోని కాళోజీ విగ్రహం సెంటర్లో ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.