బిసి, ఎస్సీ ఘర్షణలు, ఎస్సై నిర్బంధం
గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు సమాచారం అందుకున్న ఎస్ ఐ నాగేంద్రకుమార్ సిబ్బందితో అమ్మిరెడ్డిగూడెం వెళ్లారు. ఎస్సీ కాలనీ యువకుల ఫిర్యాదు మేరకు పోతురాజు కొండ, చక్కా ముత్తయ్య, మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని జీపులోకి ఎక్కించారు. వివాదానికి కారకులైన ఎస్సీ కాలనీ యువకులను వదిలేసి తమను ఎందుకు అదుపులోకి తీసుకుంటారంటూ బీసీ కాలనీవాసులు పోలీసు జీపును అడ్డుకున్నారు. పోలీసులు, బీసీ కాలనీవాసులకు మధ్య వాదప్రతివాదనలు జరుగుతుండగా, ఎస్ఐ నాగేంద్రకుమార్ పోతురాజు కొండపై చేయి చేసుకున్నారు. దీంతో కొండ స్పృహ తప్పగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమకెలాంటి సంబంధం లేకున్నా ఎస్ ఐ చేయి చేసుకున్నారని చెక్కా ముత్తయ్య ఆరోపించారు.
అసభ్యపదజాలంతో దూషిస్తూ, చేతికందిన వారిని కొట్టారని న్యాయం జరిగే వరకు పోలీసులను వదిలేదిలేదంటూ రాత్రి 9 గంటల వరకు ఎస్ఐని, సిబ్బందిని జీపుతో సహా గ్రామస్తులు నిర్బంధించారు. రోడ్డుకు అడ్డుగా బండరాళ్లు పెట్టారు. గ్రామంలో పూర్తిగా కాపుసారా నిషేధిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వారంటున్నారు. ఎస్ఐ చేతిలో గాయపడిన పోతురాజు కొండను 108లో తిరువూరు కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తిరువూరు ఎస్ఐ గోపాలకృష్ణ, ఎక్సైజ్ సీఐ ప్రకాష్, కాంగ్రెస్ నేత మందపాటి చినగోపిరెడ్డి స్థానికులకు నచ్చజెప్పడంతో ఎస్ఐని విడిచిపెట్టారు.