ఇంజినీరింగ్ విద్యార్ధి దారుణ హత్య
ఐదు గంటల తరువాత తోటి విద్యార్థులు హర్షవర్ధన్ రెడ్డి, నాగాంజనేయులు వచ్చి అతడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకెళ్ళారు. గంట తరువాత చెన్నారెడ్డిని స్థానిక అరండల్ పేటలోని నిల్ హాస్పటల్ వద్దకు తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదం జరిగిందని ఆస్పత్రి సిబ్బందికి చెప్పారు. అక్కడున్న కాంపౌండర్ హనిమిరెడ్డి పరీక్షించి చెన్నారెడ్డి చనిపోయాడని చెప్పారు. ఆ ఇద్దరు యువకులు, వారితో పాటు వచ్చిన మరికొందరు..బంధువులకు చెబుతామంటూ వెళ్లిపోయారు. ఈ సమాచారం ఆ తరువాత స్థానికంగా ఉన్న చెన్నారెడ్డి బంధువులకు తెలిసింది. చెన్నారెడ్డి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి.
ముఖం మీద, కాళ్ళపైన, మర్మా వయవాలపై గాయాలై రక్తం కారినట్లు కనిపిస్తోంది. క్రికెట్ బ్యాట్లతో కొట్టి హత్యచేసి ఉంటారని పోలీసులు, బంధువులు అనుమానిస్తున్నారు. పట్టణ సీఐ దిలీప్ కుమార్, ఎస్ ఐ సాంబశివరావు, రూరల్ ఎస్ ఐ సుబ్బారావు ఆస్పత్రిలో చెన్నారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. కళాశాల విద్యార్థి వెంకటేశ్వర్లును విచారించి వివరాలు సేకరించారు. ఆ సమాచారం మేరకు..విద్యార్థులు నాగాంజనేయులు, హర్షవర్థన్రెడ్డిలకు చెన్నారెడ్డికి బుధవారం కళాశాలలో కూర్చునే కుర్చీల వద్ద వాదన జరిగింది. అంతకుముందు ఓ యువతి విషయంలో కూడా వారిమధ్య విభేదాలున్నాయని తెలిసింది. ఈ హత్యకు సంబంధించి ఆరుగురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.