మహబూబ్ నగర్: విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కరెంట్ అమ్ముకునే ఓ వ్యాపారి మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యానించారు. కోటి మంది లగడపాటి రాజగోపాల్ లు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమను అవమానిస్తే తెలంగాణ ప్రజలు లగడపాటిని క్షమించరని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్ తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
కెసిఆర్ ఆరు నెలల తర్వాత తన సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ కు వచ్చారు. ఆయన జిల్లా కలెక్టర్ తో సమావేశమయ్యారు. తన మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం పరిధిలో మంచినీరు, విద్యుత్ సమస్యపై ఆయన జిల్లా కలెక్టరుతో మాట్లాడారు.