విస్తరణ మాట ఊరించడానికేనా?
పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన మంత్రులు తమ పదవులను కోల్పోతే మిన్నకుండే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. దీనివల్ల పరిస్థితి మళ్లీ మొదటికి రావచ్చునని పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే ఇన్నాళ్లు పడిన శ్రమ వృధా అవుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందువల్ల మంత్రివర్గ విస్తరణ అంత సులభమైన పని కాదని తెలిసిపోతూ ఉంది. తాజాగా, మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రోశయ్య చీరాలలో అన్నారు. మంత్రివర్గ విస్తరణ ఊసే లేనప్పుడు ఆయన ఎందుకీ మాటలన్నట్లు అనేది ప్రశ్న.
మంత్రి పదవులు ఆశిస్తున్నవారిని, మంత్రి పదవులు పోకుండా కాపాడునుకునేవారిని తన చుట్టూ ఉంచుకోవడానికి ఆయన పదే పదే మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా ప్రజాపథం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆయన వ్యూహంలో ఒక భాగమని చెబుతున్నారు. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లోనూ శాసనసభ్యులు పార్టీ అభ్యర్థుల విజయానికి కష్టపడి పనేచేసేలా చూడడం కూడా ఆయన వ్యూహంలో మరో భాగమని అంటున్నారు. నిజానికి, మంత్రి వర్గ విస్తరణ ఊసు ఇప్పట్లో వచ్చేది కాదనేది మాత్రం కొంత మంది గట్టిగానే చెబుతున్నారు.