పేర్ని నానికి మంత్రివర్గంలో అవకాశం!
కాంగ్రెసు తరఫున కేపీ సారథి, పేర్ని వెంకట్రామయ్య రెండోసారి గెలిచారు. మిగిలిన వారిలో పామర్రు నుంచి డీవై దాస్, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు, తిరువూరు నుంచి దిరిశం పద్మజ్యోతి, పెడన నుంచి జోగి రమేష్లు ఎన్నికయ్యారు. గత ఏడాది ఎన్నికల అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గ ఏర్పాటులో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో కేపీ సారథి, పేర్ని నాని పేర్లు అప్పట్లో ప్రముఖంగా వినిపించాయి. కాపు సామాజిక వర్గం నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో వట్టి వసంత కుమార్కు, గుంటూరులో కన్నా లకీ నారాయణకు ప్రాధాన్యం ఇవ్వడంతో నానికి మంత్రి పదవి లభించలేదు.
త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే 2004 నుంచి 2009 వరకు పేర్ని నాని బందరు నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ పరిగణనలోకి వస్తాయని నాయకులు పేర్కొంటున్నారు. సోమవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో కూడా మంత్రి సారథి మంత్రివర్గ విస్తరణ గురించి ప్రస్తావిస్తూ, జిల్లాలో మరొకరికి పదవి దక్కే అవకాశం ఉందని చెప్పారు. పేర్ని నానికి వచ్చే అవకాశాలున్నాయని కూడా బయటపెట్టారు. గతంలో మంత్రివర్గం ఏర్పాటు సందర్భంగా నానికి తృటిలో మంత్రి పదవి తప్పిందని వ్యాఖ్యానించారు. ఆయన సేవలను పరిగణనలోకి తీసుకుని మంత్రి పదవిని సీఎం కేటాయిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.