ఐదుగురు నకిలీ నక్సలైట్ల అరెస్టు
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తుమ్మలచెరువుకు చెందిన బూసి రాంబాబు అలియాస్ సుదర్శన్రెడ్డి అలియాస్ విష్ణు అలియాస్ శ్రీనివాస్, మేళ్ళచెరువు మండలం వెల్లటూరుకు చెందిన బైరిపంగు యలమంద, బైరిపంగు కనకయ్య, మల్లారెడ్డిగూడెంకు చెందిన బైరిపంగు శంభయ్య, నేరేడుచర్ల మండలం సజ్జాపురంకు చెందిన ధీరావత్ కాంతారావులు నక్సల్స్ పేరుతో చందాలు వసూలు చేస్తున్నారు. సీపీఐ మావోయిస్టు నల్లమల ఏరియా కమిటీ కార్యదర్శి చంద్రన్నవర్గం, ఉత్తర తెలంగాణ కార్యదర్శి గణేష్ దళ సభ్యులమని వారి లెటర్ ప్యాడ్లపై లేఖలు రాసి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వ్యాపారులను, డబ్బున్నవారిని ఎంచుకుని లేఖలు చూపిస్తూ అజ్ఞాత ప్రదేశంలోకి తీసుకెళ్లి అలివ్ గ్రీన్ దుస్తులు ధరించి, ఆయుధాలతో బెదిరించి చందాలు వసూలు చేస్తున్నారు.
వీరిపై గుంటూరు జిల్లాలో రెండు, హుజూర్నగర్లో మూడు, మేళ్ళచెరువులో ఒకటి, ఖమ్మంలో ఒకటి, కోదాడలో మూడు కేసులు నమోదయ్యాయి. ఆదివారం బూసి రాంబాబు నేరేడుచర్లలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నకిలీ నక్సల్స్ ఉదంతం వెలుగు చూసింది. రాంబాబు మాజీ జనశక్తి నాయకుడు సత్యానంద్కు బావమరిది. రాంబాబు నివాసం ఉంటున్న ఇంటిలో ఆయుధాలు, సాహిత్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.