వైష్ణవి హత్యకేసులో ఈవారమే చార్జిషీట్
నిందితులు ముగ్గురి తరఫున వేర్వేరుగా వారి న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై వాదోపవాదాలు వినిపించేందుకు మహిళా సెషన్స్ కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఇదిలావుండగా నిందితులకు నార్కో పరీక్షలు చేయించేందుకు కోర్టు అనుమతి పొందిన పోలీసులు గుజరాత్లోని అహ్మదాబాద్ నార్కో ల్యాబ్ నుంచి తేదీలు ఖరారు చేసుకున్నారు. మే 1నుంచి 10వరకు షెడ్యూలు ఖరారు కాగా నిందితులు అరెస్టయి 4వ తేదీకి 90రోజులు ముగుస్తుంది. 90రోజుల్లోగానే ఛార్జిషీటు దాఖలు చేయాల్సి ఉన్నందున 1నుంచి 4వ తేదీలోగా ఏరోజైనా దాఖలు చేసే అవకాశం ఉంది.
పోలీసు ఛార్జిషీటు దాఖలు చేసే సమయానికి నిందితులను ఇక్కడి నుంచి నార్కో పరీక్షలకు తరలించవచ్చు. అయితే ఛార్జిషీటు కాపీలు నిందితులకు చేరాల్సి ఉన్నందున బహుశా ఈ తంతు పూర్తయిన తర్వాతే గుజరాత్ తీసుకెళ్లవచ్చనే అభిప్రాయం వ్యక్తవౌతోంది. ఛార్జిషీటు దాఖలుకు సన్నాహాలు చేస్తున్న పోలీసులు మరోవైపు నిందితులను నార్కో పరీక్షలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా కొద్దిరోజుల్లో కోర్టు ద్వారా జిల్లా జైలు నుంచి వీరిని జుడిషియల్ కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది