కెసిఆర్ ను సీరియస్ గా తీసుకోను: డిఎస్
ఉప ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై తనకు సొంత అభిప్రాయం లేదని, పార్టీ అధిష్టానం దానిపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. తాను అన్ని ప్రాంతాలకు సంబంధించిన పిసిసి అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్నానని, అందువల్ల తనకు సొంత అభిప్రాయాలు లేవని, పార్టీ విధానపరమైన నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీకి పార్టీ తరఫున నివేదిక ఇవ్వాలా, వద్దా అనే విషయంపై తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తమది జాతీయ పార్టీ అని, తెరాస ఉప ప్రాంతీయ పార్టీ అని, ఒక ప్రాంతానికి కట్టుబడి ఉన్న తాను అన్ని ప్రాంతాలకు చెందిన పదవిలో ఉంటూ తాను నివేదిక సమర్పించడం సరికాదని, బాధ్యత గల వ్యక్తిగా తాను నివేదిక సమర్పించడం లేదని ఆయన అన్నారు. తనకు స్పష్టమైన వైఖరి ఉందని ఆయన చెప్పారు.
తన నిజామాబాద్ పర్యటనకు మంచి స్పందన లభించిందని, తాను నిజామాబాద్ నుంచి పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. పార్టీ నాయకులు కూడా తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించకూడదని, ఏమైనా సూచనలుంటే అధిష్టానానికి చేయాలని ఆయన అన్నారు. తమ అభిప్రాయాలను వెల్లడించడం ద్వారా పార్టీ కార్యకర్తలను, శ్రేణులను అయోమయానికి గురి చేయకూడదని ఆయన సూచించారు.