విచారణకు నేనే వస్తా: పోలీసులతో రంజిత
ధ్యానపీఠం వ్యవస్థాపకుడు రాసలీలల స్వామి నిత్యానంద జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు ఆయన తరుపు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసు కష్టడీ ముగిస్తే నిత్యానంద తప్పనిసరిగా జైలుకు వెళ్లవలసి ఉంటుంది. నిత్యానందను శుక్రవారం సాయంత్రం వరకు విచారించేందుకు రామనగర కోర్టు సిఐడి పోలీసులకు అనుమతి ఇచ్చింది. నిత్యానంద, రంజితల రాసలీలలను చిత్రీకరించిన లెనిన్ కరుప్పన్ విచారణ ఇప్పటికే పూర్తయింది. అవసరానికి తగినట్లుగా మళ్లీ ఆయన్ను విచారిస్తామని అధికారులు తెలిపారు. నిత్యానంద విచారణలో ఒక రోజు పూర్తిగా విశ్రాంతి, ధ్యానానికే పరిమితం కావటం, ఒకరోజు అనారోగ్యం పేరిట ఆసుపత్రిలో చేరటంతో విచారణ ఆశించిన స్థాయిలో సాగలేదు. మరో పది రోజుల పాటు విచారణకు తమకు అప్పగించాలని పోలీసులు కోరాలని భావించినా చివరి క్షణంలో ఆరు రోజుల పాటు మాత్రం విచారణకు అప్పగించాలని న్యాయమూర్తిని కోరారు. అయితే 2రోజులకు మాత్రమే విచారణకు అవకాశం ఇస్తూ న్యాయమూర్తి అనుమతించారు.