కసబ్ ను దోషిగా నిర్ధారించిన ప్రత్యేక కోర్టు
ప్రత్యేక న్యాయమూర్తి ఎంఎల్ తహిల్యాన్ని తీర్పు వెలువరించే సమయంలో కసబ్ ను జైలు నుంచి కోర్టుకు తీసుకుని వచ్చారు. కసబ్ పై మోపిన అభియోగాలను తహిల్యాని వినిపించారు. ఆ తర్వాత ఐదు పేజీల తీర్పు ప్రతిని చదవడం ప్రారంభించారు. తీర్పు వెలువరించిన సమయంలో మీడియాను ప్రత్యేక అనుమతి పత్రాలతో లోనికి అనుమతించారు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కసబ్ తో పాటు ఈ కేసులో ఫహీం అన్సారీ, షాబుద్దీన్ లను కూడా పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. ఈ ముగ్గురు నిందితలకు తహిల్యాన్ని తీర్పు పాఠం చదివి వినిపించారు. భారత్ కు చెందిన అన్సారీ, షాబుద్దీన్ లు ఉగ్రవాదులకు దాడులు చేసేందుకు వీలుగా మ్యాప్ లను, తదితర సమాచారాన్ని చేరవేసినట్లు అభియోగాలు ఎదుర్కున్నారు.
ముంబై మారణహోమం కేసు విచారణకు 11 నెలల కాలం పట్టింది. కసబ్ నేరాన్ని అంగీకరించడంతో విచారణ ముగిసింది. ఈ కేసులో కసబ్ కిరాతకంగా కాల్పులు జరిపాడని 30 మంది సాక్ష్యులు కోర్టుకు తెలిపారు. ముంబైలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 166 మంది మరణించారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో కసబ్ ఒక్కడే ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు. ఇతనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. పలువురు సాక్ష్యులను విచారించింది. ముంబై దాడులకు సూత్రధారులు పాకిస్తాన్ లోని ఉగ్రవాద నాయకులు కాగా పాత్రధారి కసబ్. కసబ్ కు వేసే శిక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కసబ్ ను బహిరంగంగా ఉరి తీయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.