సీమాంధ్ర ఫోరం ఉత్తదే: చిన్నారెడ్డి
ఆయా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కమిటీకి టీఆర్సీసీసీ ఇచ్చినదే కాంగ్రెసు పార్టీ అధికారిక నివేదిక అని ఆయన చెప్పారు. టీఆర్సీసీసీ కాంగ్రెసులో భాగమని, ఏఐసీసీ అధినేత్రి సోనియా సంతకం ద్వారా ఏర్పడిందని, అందువల్ల టీఆర్సీసీసీది కాంగ్రెసు వాయిస్ అని, సీమాంధ్ర ఎమ్మెల్యేల ఫోరానికి అధికారిక గుర్తింపు లేదని, వారి వాదనలు, నివేదికలు కమిటీ ముందు నిలబడవని ఆయన అభిప్రాయపడ్డారు. పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్పై టీఆర్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యలను సమావేశం ముక్తకంఠంతో ఖండించినట్టు చిన్నారెడ్డి తెలియజేశారు. సమావేశానికి ముందు చిన్నారెడ్డి, పాల్వాయి గోవర్దనరెడ్డి ఆదివారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ను కలిశారు. సమావేశ అజెండాను వివరించారు. డీఎస్ సమ్మతి, సూచన మేరకే టీఆర్సీసీసీ సమావేశాన్ని ఫతే మైదాన్ క్లబ్లో నిర్వహిస్తున్నట్టు చిన్నారెడ్డి చెప్పారు గతంలో కూడా డీఎస్ సలహా మేరకే నివేదిక ఇచ్చినట్టు ఆయన చెప్పారు.
తెలంగాణ కాంగ్రెసు సీనియర్లు పలువురు ఢిల్లీకి పయనమవుతున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ పెట్టొద్దని వారు అధిష్ఠానానికి చెప్పనున్నట్టు తెలిసింది. డీఎస్ వెళుతున్న సమయంలోనే వీరు కూడా ఢిల్లీ బాట పట్టడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అధిష్ఠానం ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని డీఎస్ ఇటీవల ప్రస్తావించిన విషయం విదితమే. పార్లమెంటులో స్టాండింగ్ కమిటీల పనితీరును పరిశీలించడానికి అధ్యయన కమిటీ 5, 6 తేదీల్లో ఢిల్లీ వెళుతోంది. ఆ బృందంలో కూడా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారు ఉప ఎన్నికలపై తమ అభిప్రాయాన్ని అధిష్ఠానం చెవిన వేయొచ్చని తెలిసింది.