కసబ్ కు ఏ శిక్ష వేస్తారో తేలేది కొన్ని గంటల్లో...
ఇన్నాళ్లూ ఎన్నో మలుపులు, మరెన్నో ఆసక్తికర కోణాల గుండా పరుగులు పెట్టిన ఈ ప్రత్యేక విచారణ బుధవారంతో ముగియడంతో 22 ఏళ్ల కసబ్ భవిష్యత్తును ఈ రోజు తేల్చి వేయనుంది. న్యాయస్థానంలో ముందూ వెనకా ఆలోచించకుండా కసబ్ చేసిన నేరాంగీకార ప్రకటన, అతని నేర నిర్థారణలో కీలక భూమిక పోషించిందని, దోషిగా నిలబెట్టిందని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎమ్ఎల్ తహిల్యానీ వెల్లడించారు.
ఈ దాడిలో పాక్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తాయిబా నిర్వహించిన పాత్ర గురించి, పొరుగుదేశం నుంచి అందిన రక్షణ ఉపకరణాల గురించి కసబ్ తన వాంగ్మూలంలో అనేక విషయాలు పేర్కొన్నాడని..అవే దోష నిర్థారణకు ఉపకరించాయని తెలిపారు.
ఈ విషయాలను కసబ్ తనకు తానుగా బయటపెట్టాడని, దీని వెనక ఎవరి ఒత్తిడీ లేదని తహిల్యానీ స్పష్టం చేశారు. పోలీసుల బలవంతం మీదనే తాను ఆ విదంగా ప్రకటించాల్సి వచ్చిందన్న కసబ్ వాదనను ఆయన కొట్టివేశారు. మెజిస్ట్రేట్ చాంబర్లో తన వాంగ్మూలం నమోదు చేసే సమయంలో పోలీసులు కూడా ఉన్నారన్న కసబ్ ఆరోపణను ఆయన తేలిగ్గా కొట్టిపడేశారు.