రాజకీయ వేడిలో సిఎం 'గుంటూర్'
అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య నేతల మధ్య రాజకీయాలు తారస్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో ఆదివారం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కన్నా లకీనారాయణపై ఏఐసీసీకి ఎంపీ రాయపాటి ఫిర్యాదు చేయటం, మంత్రి కన్నా ఫిర్యాదుపై స్పందించి నేరుగా సోనియాగాంధితో ఈ విషయంపై మాట్లాడతానని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి. ఇలాంటి హడావుడి రాజకీయ వాతావరణంలో ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా నగరానికి వచ్చే సీఎం రోశయ్య ఆ ఇద్దరు నేతల నివాసాలకు వెళ్ళాలనుకోవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఎవరికి వారే పెద్దఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఎంపీ రాయపాటి ఢిల్లీలో మంత్రి కన్నాపై విమర్శలు చేయటం, మంత్రి కన్నా గుంటూరులో దీనిపై స్పందించడం, డీసీసీ అధ్యక్షుడు సింగం బసవపున్నయ్య రాయపాటిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించటం, నగర యువజన కాంగ్రెస్, నగరపాలక సంస్థ కాంగ్రెస్ కార్పొరేటర్లు పలువురు రాయపాటి తీరును విమర్శించటంతో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు హడావుడిగా మారాయి. ఈ క్రమంలో సీఎం పర్యటనలో ఏం జరుగుతుందోనని ఆందోళన కార్యకర్తల్లో ఉంటే, ఇద్దరు నేతల ఇళ్ళకు సీఎం వెళ్తున్న నేపథ్యంలో బందోబస్తు పోలీసులకు సవాలుగా మారింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, ప్రైవేటు కార్యక్రమాలకు హాజరుతోపాటు అమాత్యుల నివాసానికి విందు, అల్పాహార విందుకు హాజరు కానున్నారు. మంగళగిరి, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో పర్యటించేలా పర్యటన రూపొందించారు.