సత్యంబాబు పరారీ కట్టుకథేనా?
సత్యంబాబు పరారీపై అతని తల్లి మరియమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సత్యంబాబును ఎన్ కౌంటర్ చేయడానికే ఈ కథ అల్లుతున్నారని ఆమె అంటోంది. సత్యంబాబు పరారీ అయ్యాడనే వార్త వెలువడిన కొద్దిసేపటికే అతన్ని వరంగల్ జిల్లా జనగామ పోలీసులు పట్టుకున్నారనే ప్రచారం జరిగింది. కేసును మాయ చేయడానికే సత్యంబాబు పరారీ కథ అల్లి అతన్ని చంపేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని అయేషా తల్లి షంషాద్ బేగం ఆరోపిస్తోంది. మాజీ మంత్రి కొనేరు రంగారావు మనవడు సతీష్, మరికొంత మందిని రక్షించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆమె అంటోంది.
సత్యంబాబు పరారయ్యాడనే వార్తలపై ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నరు. కృష్ణా జిల్లా అనాసాగరం గ్రామానికి చెందిన ప్రజలు కూడా పోలీసులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సత్యంబాబు ఈ గ్రామానికి చెందినవాడే. సత్యంబాబు ఇంకా పోలీసుల అదుపులోనే ఉండవచ్చునని కూడా అంటున్నారు. సత్యంబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.