సొంత గ్రామానికి కొంత చేసిన వేటూరి
గేయ రచనల ద్వారా తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం చేసిన వేటూరికి స్వగృహం లేకపోవడం బాధాకరమని పద్మనాభప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని వేటూరి నాటి మంత్రి కోడెల శివప్రసాద్తో మాట్లాడి మంజూరు చేయించారన్నారు.
పెదకళ్లేపల్లిలో జన్మించిన వేటూరి ప్రస్తుతం వైశ్యుల సత్రంగా పిలిచే పాఠశాలలో ప్రాథమిక విద్యలో ఐదో తరగతి వరకు విద్యనభ్యసించినట్లు ఆయన ఆత్మీయుడు కొడాలి సీతారామప్రసాద్ తెలిపారు. అనంతరం గుంటూరు జిల్లాలో ప్రస్తుత సీఎం రోశయ్యతో కలసి కొల్లూరు పాఠశాలలో పదో తరగతి వరకు విద్యనభ్యసించినట్లు చెప్పారు. పెదకళ్లేపల్లికి వచ్చిన ప్రతిసారీ శ్రీదుర్గానాగేశ్వర స్వామివారిని దర్శించుకుని వెళ్లి కవిత్వాలు రాసేవారని స్థానికులు చెబుతున్నారు. వేటూరిపై అభిమానంతో గ్రామస్తులు ఆయన పుట్టిన రోజును ప్రతి సంవత్సరం పెదకళ్లేపల్లిలోనే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని ఎంపీటీసీ సభ్యుడు అరజా సాంబశివరావు తెలిపారు. గ్రామంలో సంగీత కళాశాల స్థాపించి పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ఆయన కలలు నెరవేరలేదన్నారు. వేటూరి ప్రభాకరశాస్త్రి, దక్షిణామూర్తి, ఘంటసాల వంటి ప్రముఖులతో సంగీతానికి ఈ గ్రామంలో బీజం ఏర్పడిందని, ఇది తమకు గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తికి ముక్త్యాల, జగ్గయ్యపేట గ్రామాలతో విడదీయరాని అనుబంధముంది. బాల్యమంతా ఆయన ఈ ప్రాంతాల్లోనే గడిపారు. విద్యా బుద్ధులు కూడా ఇక్కడే నేర్చుకున్నారు. వేటూరి బాబాయి శంకరశాస్త్రి ముక్త్యాల జమీందారు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ సంస్థానంలో ఆస్థాన వైద్యునిగా పనిచేశారు.
అనంతరం ఆర్ష రసాయనశాల పేరుతో వైద్యశాల స్థాపించారు. శంకరశాస్త్రి సోదరులైన ప్రభాకర శాస్త్రి, చంద్రశేఖర శాస్త్రి జగ్గయ్యపేట వచ్చి వైద్య వృత్తిలో స్థిరపడిపోయారు. అప్పటికి సుందర రామ్మూర్తికి ఏడేళ్ల వయసుంటుంది. కొంతకాలం ముక్త్యాలలో జానపాటి లకీకాంతారావు వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న వేటూరి అనంతరం జగ్గయ్యపేటలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నారు. అప్పట్లో వేటూరితో కలసి చదువుకున్న మిత్రులు నేడు ముక్త్యాలలో అనేకమంది ఉన్నారు.