మా వాళ్లు హద్దు మీరుతున్నారు: సిఎం
తాను ఏ ఒక్కరినీ ఉద్దేశించి మాట్లాడటం లేదనీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చానని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ పత్రికే కథనాలు రాస్తోందని విలేకరులు ప్రశ్నించగా. ఏ పత్రికలో ఎవరికి పెట్టుబడులు ఉన్నాయో ఎవరికి తెలుసు, ఏదేమైనా వాస్తవాలు తెలుసుకుని రాయడం మంచిదని సూచించారు. సంక్షేమ పథకాలు కనుమరుగవుతాయనీ, కోతలు ఉంటాయనీ, సర్కారు సందిగ్ధంలో ఉందంటూ ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తున్నారని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల నుంచి పక్కకు తప్పుకోదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరినీ మనోవేదనకు గురిచేసిన వరద నష్టంపై ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి సమాచారం అందిస్తున్నానని, పూర్తి సమాచారాన్ని ఢిల్లీ పర్యటనలో వివరించనున్నట్లు చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బాగా చదువుకున్న వారని, చంద్రబాబుతో తాను పోటీ పడలేనని సీఎం వ్యాఖ్యానించారు. ఆకాశమార్గ పరిశీలన పేరిట తాను నిద్రపోవడానికి వెళ్లలేదని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఆర్థికంగా వత్తిళ్లు ఉన్నప్పటికీ ఖజానా దివాళా తీయలేదని, దివాళా తీసే కార్యక్రమాలు చేపట్టబోమని తెలిపారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆర్బీఐ నుంచి ఒక్కసారీ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోలేదని, తెదేపా హయాంలో 360 రోజులు ఓవర్డ్రాఫ్ట్ మీదనే నడిపించారని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితుల మేరకు సర్దుబాట్లు జరుగుతున్నాయని తెలిపారు.