మహబూబాబాద్ రైల్వే స్టేషనులో యుద్ధ వాతావరణం
ఫ్లాట్ ఫారం మీది నుంచి ప్రయాణికులంతా వెళ్లిపోయారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని ప్రజలు కూడా బయటకు రావడం లేదు. ఆందోళనకారులు పెద్ద యెత్తున బాణసంచా పేలుస్తున్నారు. దీంతో బాంబులు పేలుతున్న చప్పుడు వినిపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జగన్ యాత్రను అడ్డుకుని తీరుతామని పట్టుదలతో తెలంగాణవాదులు ఉన్నారు. పోలీసులు గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. పరిస్థితి పోలీసుల అదుపు దాటి పోయినట్లు అనిపిస్తోంది. కాంగ్రెసు నాయకులపై రాళ్లు వేయడం ప్రారంభించడంతో వాతావరణం వేడెక్కుతూ వచ్చింది.
తెలంగాణవాదులు రైల్వే స్టేషనుకు ఎప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పరిస్థితి పోలీసుల చేతికి చిక్కడం లేదు. పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు. రబ్బరు బుల్లెట్లు వదిలారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వాస్తవానికి జగన్ ఉదయం 11 గంటలకే మహబూబాబాద్ రైల్వే స్టేషనుకు చేరుకోవాల్సి ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆటంకాలు కల్పిస్తుండడంతో ఆలస్యం అయింది. జగన్ కు స్వాగతం చెప్పడానికి వచ్చిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ కూడా గాయపడినట్లు తెలుస్తోంది.