ఓదార్పు యాత్రపై వైయస్ జగన్ ది మూర్ఖత్వం: కె చంద్రశేఖర రావు
వైయస్ జగన్ ది ఓదార్పు యాత్రనా, దండయాత్రనా అని ఆయన ప్రశ్నించారు. ఇనుప రాడ్లకు కాంగ్రెసు జెండాలు పెట్టుకున్నారని, బేస్ బాల్ బ్యాట్లతో వచ్చారని, పిస్టల్స్, బుల్లెట్లతో వచ్చారని, ఓదార్పు యాత్రకు ఇవన్నీ ఎందుకని ఆయన అన్నారు. కొండా మురళి, కొండా సురేఖల వల్లనే హింసాకాండ చెలరేగిందని ఆయన ఆరోపించారు. వారిని అరెస్టు చేయకుండా వారికి రాచ మర్యాదలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ నాయకులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, తెలంగాణ జెఎసి నేత కోదంరామ్ తదితర తెలంగాణవాదులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. వారిపై కేసులు ఎత్తేసి ప్రభుత్వం, డిజిపి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబాబాద్ సంఘటనపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా విచారించకపోవడం మరోసారి తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు.
మహబూబాబాద్ లో మొత్తం 21 మంది గాయపడ్డారని ఆయన చెప్పారు. కొండా మురళి జరిపిన కాల్పుల వల్లనే చాలా మంది గాయపడ్డారని, దానిపై విచారణ జరిపించడం అవసరమని, లైసెన్స్ లేని గన్ లతో కాల్పులు జరిపారని ఆయన అన్నారు. మీడియాపై కూడా దాడి చేశారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించే నీతిని జగన్ అవలంబిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సాయుధ ముఠాలు మహబూబాబాద్ లోకి ప్రవేశించాయని ఆయన ఆరోపించారు. కొండా దంపతులు రెచ్చగొట్టడం వల్లనే ప్రశాంతత దెబ్బ తిన్నదని ఆయన అన్నారు. కొండా మురళి మహబూబాబాద్ వచ్చే వరకు ప్రశాంతంగానే ఉందని, తెలంగాణవాదులు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని, మురళి తెలంగాణవాదులను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు.