టీవీ ఆర్టిస్టులపై దాడులు: సెల్వరాజ్ పై అనుమానాలు
దాసరి పద్మ నిర్మిస్తున్న తూర్పు పడమర సీరియల్ లో సెల్వరాజ్ ను తీసేసి ఆ స్థానంలో శ్రీధర్ వర్మను హీరోగా ఎంపిక చేసుకున్నారు. అదే విధంగా ఆరాధన టీవీ సీరియల్ లోనూ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సెల్వరాజ్ తీవ్ర అసంతృప్తికి, అనహనానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. శ్రీధర్ వర్మపై దాడి జరిగిన వెంటనే ఆ దాడితో తనకు ఏ విధమైన సంబంధం లేదంటూ సెల్వరాజ్ ప్రకటన చేశాడు. తాను సెల్వరాజ్ పై ఫిర్యాదు చేయలేదని శ్రీధర్ వర్మ అన్నారు. అవకాశాలు రాలేదనే కోపంతో ఈ విధమైన దాడులు పాల్పడితే సహించరాదని సినీ నిర్మాత భరద్వాజ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా, ఈ దాడులపై మరో వాదన కూడా వినిపిస్తోంది. చౌకబారు ప్రచారం కోసం కూడా ఈ విధమైన దాడుల వ్యవహారాలు సాగుతుండవచ్చుననేది ఆ వాదన. సీరియల్స్ ను హిట్ చేయడానికి ఈ విధమైన ప్రచారాన్ని వాడుకుంటున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే, బుల్లి తెర రంగంలో ఆధిపత్యం కోసం కూడా ఇటువంటి దాడులు జరుగుతుండవచ్చునని అంటున్నారు. డింపుల్ పై జరిగిన దాడికి సంబంధించి కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు.