చంద్రబాబు నాయుడు కంటతడి: రాత్రీ భోజనం తీసుకునేందుకు ససేమిరా
చంద్రబాబు సహా 74 మంది తెదేపా నేతలకు ధర్మాబాద్ మెజిస్ట్రేట్ ఈ నెల 26 వరకు జ్యుడీషియల్ కస్టడిని పొడిగించింది. నాలుగు రోజులపాటు ఐటీఐ కళాశాలలో ఉంచిన నేతలను సోమవారం రాత్రి ఔరంగాబాద్ జైలుకు తరలించటానికి మహారాష్ట్ర పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఐజీ శారదా ప్రసాద్ యాదవ్, ఎస్పీ సందీప్ కార్నిక్ల పర్యవేక్షణలో నేతల తరలింపునకు ఏర్పాట్లు జరిగాయి. టిడిపి నేతలకు చెందిన 24 సొంత వాహనాలకు మహారాష్ట్ర పోలీసులు అనుమతులు ఇచ్చారు. నేతలను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సులతో పాటు 60కి పైగా మహారాష్ట్ర వాహనాలు ఏర్పాటు చేశారు. మొత్తం 100 వాహనాలతో కాన్వాయ్ వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. నేతల కాన్వాయ్ వెళ్లడానికి ముందు, తర్వాత గంట తేడాతో ఇతర వాహనాలను అనుమతించకూడదని నిర్ణయించారు. నలుగురు నేతలకు పది మంది చొప్పున వందల మంది పోలీసులను ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.