ఈనాడు డైలీ టార్గెట్ వైయస్ అల్లుడు అనిల్ కుమార్
ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి - ఖమ్మం జిల్లాలోని మూడు మండలాలను గుత్తగా సొంతం చేసుకున్న రక్షణ స్టీల్స్తో వైఎస్ అల్లుడు అనిల్ కుమార్కు ఎలాంటి సంబంధం లేదంటూ సదరు సంస్థలు ఎన్ని కబుర్లు చెబుతున్నా తరచి చూసినకొద్దీ.. ఆ 'అపవిత్ర బంధా'నికి సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రక్షణ స్టీల్స్ డైరెక్టరైన ఉప్పుతోళ్ల కొండలరావు బ్రదర్ అనిల్ కుమార్కు సన్నిహితంగా మెలగటమే కాదు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఏర్పాట్లు కూడా చేస్తుంటారని ఇప్పటికే ప్రతిపక్షాలు శాసనసభా వేదిక మీదే ఎలుగెత్తాయి. తాజాగా ఇందుకు సంబంధించి మరిన్ని ఆధారాలు బయటపడ్డాయి. బ్రదర్ అనిల్ కుమార్కు చెందిన ఆధ్యాత్మిక సంస్థ 'అనిల్ వరల్డ్ ఇవాంజిలిజమ్' నిర్వహిస్తున్న "www.aweministries.org" వెబ్సైట్లో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. బ్రదర్ అనిల్ కుమార్ తన కోటు విప్పి మరీ కొండలరావు చేతికి ఇచ్చేంత సాన్నిహిత్యమూ వీరిద్దరి మధ్యా ఉందని వెబ్ సైట్ వీడియోలు స్పష్టం చేస్తున్నాయి.
అనిల్ మత ప్రచార సంస్థ, రక్షణ స్టీల్స్ కార్యాలయం రెండూ హైదరాబాద్లోని ఆదిత్య ఎలైట్ అపార్ట్మెంట్లో ఒకే అంతస్తులో పక్కపక్క ఫ్లాట్స్లోనే ఉన్న వాస్తవాన్ని తాము వెల్లడి చేశామని, ఇప్పుడు దీనికి తోడు అనిల్ వివిధ వేదికలపై కొండలరావుతో కలిసి ఉన్న ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయని ఈనాడు దినపత్రిక వ్యాఖ్యానించింది.
ఈనాడు వార్తా కథనంలోని మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి - బయ్యారం మైనింగ్ లీజు మొత్తం ఏపీఎండీసీకే అని, అంటే ప్రభుత్వ కార్పొరేషన్కే ఇచ్చారని, అదేమీ తమకు గుత్తగా ఇవ్వలేదని రక్షణ స్టీల్స్ చెప్తోంది. అయితే లీజు ఎవరికిచ్చినా ఖనిజం మాత్రం రక్షణ స్టీల్స్కు చెందాల్సిందే. ఏపీఎండీసీకి, రక్షణ స్టీల్స్కు మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా గార్ల, బయ్యారం, నేలకొండపల్లి మండలాల్లోని రైతుల భూములు, పట్టా భూములు, అటవీ భూములు, ప్రభుత్వ భూములు వేటిలో ఖనిజం ఉన్నా అది ఏపీఎండీసీ తవ్వి, తిరిగి రక్షణ స్టీల్స్కే అమ్మాలి. రక్షణ స్టీల్స్ ఉన్నంత కాలం ఈ మూడు మండలాల్లోని ఇనుప ఖనిజాన్ని ఏపీఎండీసీ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మరెవరికీ అమ్మేందుకు వీల్లేదు. ఒప్పందం ఇంత పకడ్బందీగా చేసుకున్నాక ఇక లీజు ఏపీఎండీసీది అయితే ఏంటి? రక్షణ స్టీల్స్ది అయితే ఏంటి?