వైయస్ జగన్ ఆస్తులపై ఈనాడు దినపత్రిక తీవ్ర ఆరోపణలు
డబ్బు కాదు, అధికారమే అసలు పెట్టుబడి అని వ్యాఖ్యానిస్తూ జగన్ సంస్థలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయో ఈనాడు దిన పత్రిక విశ్లేషించింది. అటు తండ్రి తన అధికార ప్రాబల్యంతో ప్రభుత్వం ద్వారా పనులు చేయించి పెడతారని, అలా లబ్ధి పొందినవారు ఇటొచ్చి కుమారుడి కంపెనీల్లో ఉద్దరంగా పెట్టుబడుల రూపంలో భారీ మొత్తాలు ముట్టజెప్పేస్తారని ఆరోపించింది. సింపుల్, ఎక్కాడా ఏమీ కనబడదని, ఎక్కడికక్క అంతా సజావుగానే కనిపిస్తుంటుందని, కానీ సంపద చేతులు మారిపోతుందని, దేశ రాజకీయ, అధికార చరిత్రలో ఎవ్వరికీ తట్టని, ఎవరూ సాహసించని మహా మాయా ప్రయోగ సూత్రం అది అని వివరించింది.
పైకి చూడడానికి ఎక్కడా ఏ లొసుగూ కనబడదని, అంకెలన్నీ కుదురుగానే ఉంటాయని, పావులు చకచకా కదిలిపోతుంటాయని, కానీ చివరికి ఫలితం చూస్తే మాత్రం ఆర్థిక రంగంలో ఆరితేరిన ఉద్ధండులక్కూడా మెదడు మొద్దుబారిపోవడం ఖాయమని ఈనాడు దినపత్రిక పెద్ద పెద్ద అక్షరాల్లో వ్యాఖ్యానించింది. తరచి చూసిన కొద్దీ...ఎక్కడో ఏదో అదృశ్యశక్తి తంత్రం చెయ్యకుండా..ఏదో ఎక్స్ ఫ్యాక్టర్ లేకుండా...కేవలం 45 కోట్ల మొత్తం... మూడున్నరేళ్లలో...దినదినాభివృద్ధి కూడా కాదు..క్షణాక్షణాభివృద్ధి చెందుతూ...రూ. 3000 కోట్లకు చేరిపోయి...పనిగట్టుకుని మరీ వచ్చి జగన్ పెరట్లో మేటలు వేయటం ఎసా సాధ్యమైందని ఎవరికైనా అనిపించడం తథ్యమని ఈనాడు దినపత్రిక అన్నది.
అధికారమే పెట్టుబడిగా జగన్ ఆస్తులు ఎలా పెరిగాయో, పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో ఈనాడు దినపత్రిక వివరించింది. రఘురామ్ సిమెంట్స్ భారతీ సిమెంట్స్ కార్పోరేషన్ గా రూపుదిద్దుకుని ఎలా తన ధనార్ధన వ్యవహారాన్ని నడిపిందో కూడా వివరించింది. జగన్ కు సంక్రమించిన ఆస్తులు ఏమిటి, మూడున్నరేళ్లలో ఎలా పెరిగాయి కూడా ఈనాడు దినపత్రిక వ్యాఖ్యానించింది.