ఉప ఎన్నికల్లో గెలుపు: ఫలించిన కెసిఆర్ వ్యూహం
సిద్ధిపేట నియోజకవర్గంలో హరీష్ రావు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన 95 వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. మూడు సార్లు వరుసగా ప్రత్యర్థుల డిపాజిట్లను ఆయన గల్లంతు చేశారు. మంచిర్యాలలో తెరాస అభ్యర్థి గడ్డం అరవింద్ రెడ్డి 77, 922 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దర్మపురి సీటులో తెరాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 58,854 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వేములవాడలో చెన్నమనేని రమేష్ 50,443 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చెన్నూరులో తెరాస అభ్యర్థి నల్లాల ఓదేలు 44,284 ఆధిక్యతతో విజయం సాధించారు. సిర్పూర్ లో తెరాస అభ్యర్థి కావేటి సమ్మయ్య 15,241 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. పలు చోట్ల తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. తెలంగాణ సీనియర్ నాయకులు వద్దన్నా పోటీకి అభ్యర్థులను పోటీకి దింపిన చంద్రబాబుకు పరాభవం తప్పలేదు.
తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభావం చూపనుంది. ఈ ఫలితాలతో తెలంగాణ ఏర్పాటు డిమాండ్ మరోసారి ఊపందుకుంది. తెలంగాణ ఏర్పాటు చేయక తప్పదని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్, మధు యాష్కీ వంటి వారు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకతను ఫలితాలు చాటి చెబుతున్నాయని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అన్నారు. స్థానిక పరిస్థితులే తెరాస గెలుపునకు కారణమని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ఫలితాలపై విశ్లేషణ చేస్తామని ఆయన చెప్పారు. మొత్తం మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను ప్రజలు ఈ ఎన్నికల్లో ప్రజలు చాటి చెప్పారని భావిస్తున్నారు.