బాబ్లీపై పిఎంతో సమావేశంలో మహారాష్ట్ర వాదనకే మొగ్గు
సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్చవాన్లతో సమావేశమయ్యారు. సాయంత్రం తన అధికార నివాసంలో గంటంపావుపాటు జరిగిన ఈ సమావేశంలో తొలి 60 నిమిషాలు ప్రధానమంత్రి ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల మంత్రి పవన్కుమార్ బన్సల్, తన ముఖ్యకార్యదర్శి టి.కె.ఎ.నాయర్ లతో కూర్చొని చర్చించారు. చివరి పదిహేను నిమిషాల్లో మన రాష్ట్రం నుంచి భారీ నీటిపారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్య, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.కె.అగర్వాల్, మహారాష్ట్ర నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర నీటిపారుదలశాఖ కార్యదర్శి, కేంద్రం నుంచి సి.డబ్ల్యు.సి. ఛైర్మన్ అరుణ్కుమార్ బజాజ్, కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి యు.ఎన్.పంజియర్లు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం కేంద్ర జలవనరులశాఖ మంత్రి పవన్కుమార్ బన్సల్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు రోశయ్య, అశోక్చవాన్లను వెంటబెట్టుకొని మీడియా ముందుకొచ్చి...అంతకుముందే సిద్ధం చేసుకొచ్చిన లిఖిత పూర్వక ప్రకటనను చదివి వినిపించారు. "ప్రధానమంత్రి బాబ్లీ సమస్యపై ఆంధ్రా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, జలవనరుల మంత్రితో చర్చించారు. ఈ అంశం సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నట్లు చర్చల సమయంలో గుర్తించారు. దీనిపై సుప్రీం కోర్టు త్వరలో నిర్ణయం వెలువరించనుందని భావిస్తున్నాం. ఈ మధ్యలో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులకు పూర్తిగా కట్టుబడి ఉండాలని ఇరురాష్ట్రాల వారు నిర్ణయించారు. ఈ ఒప్పందం అమలును కేంద్ర జలవనరుల సంఘం పరిశీలిస్తుంది" అని చెప్పారు.