ఓపిక నశించింది.. 'రోబో' నిర్మాతలుని వదిలేది లేదు
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్లతో దర్శకుడు శంకర్ రూపొందించిన 'రోబో' చిత్రం ఆంధ్రప్రదేశ్ హక్కుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. 'రోబో' హక్కుల విషయంలో తనకు న్యాయం జరిగే వరకూ సినీరంగం నుంచి తప్పుకొంటున్నానని తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ అధినేత చదలవాడ శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు.
తాజాగా 'రోబో' డబ్బింగ్ హక్కులను అదే మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టి.కన్నారావుకు అమ్మినట్లు ప్రచారంలోకి రావడంతో మనస్తాపానికి గురైన చదలవాడ తనకు న్యాయం జరిగేవరకు సినీ రంగం నుంచి తప్పుకొంటున్నానని శనివారం ప్రకటించారు.'రోబో' ఆంధ్రప్రదేశ్ హక్కులను తనకు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఫర్వాలేదని, కానీ, తనకు జరిగిన అన్యాయంపై నిర్మాతలు సమాధానం చెప్పాలని ఆయన కోరారు.
'ఈ వ్యవహారంలో ఏ నేరం చేయని ఉదయ్కుమార్, సురేంద్రలను అనవసరంగా అరెస్ట్ చేసి, లాకప్లో వేయించారు. బలవంతంగా వాళ్ల నోళ్లు మూయించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి అరెస్టుతో వారి కుటుంబాలు తీరని వ్యధకు గురవుతున్నాయి. వెంటనే వారిని విడిచిపెట్టాలి' అని డిమాండ్ చేశారు. తనకూ,'రోబో' నిర్మాతలకూ మధ్య జరుగుతున్న వివాదంలో న్యాయం తనవైపు ఉన్నందువల్లే చిత్రసీమకు చెందిన పలువురు ఫోన్లుచేసి, తనకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు.
'రోబో'హక్కుల ఒప్పంద పత్రాలను తాను మీడియా ముందు ప్రదర్శించినప్పుడు సన్ నెట్వర్క్కు చెందిన కిరణ్ తన వద్దకు వచ్చారని, తప్పు తమవైపే ఉందని ఒప్పుకొన్నారని, వ్యవహారం మరింత వివాదాస్పదం కాకుండా సంయమనంతో ఉండాలని కోరారని, తనకు న్యాయం జరిగేవిధంగా వివాదం పరిష్కారమవుతుందని హామీ ఇచ్చారని చెప్పారు. కానీ ఆయన తన మాట నిలుపుకోలేదన్నారు. తాను ఇచ్చిన రెండు కోట్ల రూపాయల డ్రాఫ్టును ఇప్పటికీ వెనక్కి తిరిగి ఇవ్వకుండా, మరో వ్యక్తికి 'రోబో' హక్కులను అమ్మడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.