పార్లమెంటు ముట్టడికి సహకరిస్తా: అజిత్ కు బాబు హామీ
సెజ్ ల కోసం ప్రభుత్వం రైతుల భూములను ఇష్టారాజ్యంగా సేకరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. రైతులకు చాలా తక్కువ ధర చెల్లిస్తోందని, మార్కెట్లో లక్షలాది రూపాయలు ఉంటే రైతులకు మాత్రం వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్లమెంటు ముట్టడికి సహకరిస్తామని అజిత్ సింగ్ కు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులు కూలీలుగా మారడమే కాకుండా వారు పొందిన నష్టపరిహారంతో ఇంటి జాగా కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై కేంద్ర ఎన్నికల సంఘం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని చంద్రబాబు అన్నారు. ఈవీఎంల పనితీరుపై అన్ని పార్టీల్లో సందేహాలు నెలకొన్నాయని తెలిపారు. ఈవీఎంల డొల్లతన్నాన్ని బయటపెట్టిన నిపుణుడు హరిప్రసాద్ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈవీఎంల అవతవకలపై అన్ని పార్టీ మద్దతుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంపై మంగళవారం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.