వైయస్ జగన్ కు చెక్: పిసిసి అధ్యక్షుడిగా రెడ్డి
పిసిసి అధ్యక్ష పదవి కోసం మాజీ హోం మంత్రి కె. జానా రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, శాసనసభ్యుడు ఉత్తమ కుమార్ రెడ్డి, మరో శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి పేర్లను అధిష్టానం షార్ట్ లిస్టు చేసినట్లు తెలిసింది. జానా రెడ్డి మినహా మిగతా ముగ్గురు నాయకులు కూడా వివాద రహితులు. జానా రెడ్డి కూడా అంతగా వివాదాస్పదుడేమీ కారు. సురేష్ రెడ్డికి వ్యవహారదక్షుడిగా, మృదు స్వభావిగా పేరుంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి ముఖ్యమంత్రి కె. రోశయ్యకు అత్యంత సన్నిహితుడు. ఉత్తమ కుమార్ రెడ్డిపై ఏ విధమైన ఆరోపణలు లేవు.
జగన్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా నియమించాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్లకు పార్టీలో అన్యాయం చేయడం లేదని, తమను ధిక్కరించడం వల్లనే జగన్ పట్ల కఠినంగా ఉంటున్నామని అధిష్టానం సంకేతాలు పంపాలని ఆలోచిస్తోంది. జగన్ వెంట వెళ్తున్నవారు కూడా ఎక్కువ మంది రెడ్లే కావడం కూడా అధిష్టానం ఆలోచనకు మరో కారణం. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులను, నాయకులను జగన్ వెంట వెళ్లకుండా ఆపడానికి కూడా వీలవుతుందని భావిస్తోంది.