తెలంగాణ అంతటా బంద్, ఉద్రిక్తత: రాస్తారోకోలు, ధర్నాలు
హైదరాబాద్ లోని హయత్నగర్ డిపో వద్ద బస్సులను తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరిఖని, కరీంనగర్ వెళ్లే 30 బస్సులను అధికారులు నిలిపివేశారు. పరీక్ష జరిగే కళాశాలల వద్ద భారీగ పోలీసులు మోహరించారు. నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, నార్కట్పల్లి, దేవరకొండ వద్ద బస్సులను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. బస్సులు ఆపాలంటూ ఆందోళన చేపట్టడంతో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అన్ని బస్టాండ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వరంగల్ జిల్లాలో పలు రూట్లలో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. అన్ని డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల బస్టాండుల్లో పోలీసుల బందోబస్తు మధ్య బస్సులు నడుస్తున్నాయి. మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ డిపో ఎదుట రాస్తారోకో చేస్తున్న తెలంగాణ ఐకాస నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిపేట డిపో ఎదుట తెలంగాణ ఐకాస నేతలు రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి.
కరీంనగర్ జిల్లాలో గ్రూప్వన్ వాయిదా వేయాలని పెద్దపల్లి బస్టాండ్ వద్ద ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ ధర్నా చేపట్టారు. బంద్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో పలు హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆందోళనకారులు రెండు బస్సులను దహనం చేశారు. ఆదివారం ఉదయం మెట్పల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులను దింపివేసి బస్సును తగులబెట్టారు. శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో గోదావరిఖని బస్టాండ్ ఆవరణలో నిలిపి ఉన్న బస్సుకు నిప్పంటించారు. మరో బస్సు అద్దాలు పగులకొట్టారు. రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో గ్రూప్ వన్ వాయిదా కోరుతూ తెలంగాణ వాదులు రైలోరోకోకు దిగారు. దీంతో తాండూరు-వాడి ప్యాసింజర్ రైలు నిలిచిపోయింది.