చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమికొడ్తాం: కెసిఆర్
నిరుడు డిసెంబరు 9కు ముందు శాసనసభలో మీరేం మాట్లాడారని ఆయన మిర్యాలగుడా సభలో చంద్రబాబును ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు, చిరంజీవి మద్దతు పలికి, కేంద్రం సానుకూలత వ్యక్తం చేయగానే, ప్లేటు ఫిరాయించి బాబు ఆధ్వర్యంలోనే ఆంధ్రావారంతా ఒక్కటయ్యారని విమర్శించారు. సీపీఎం పేదల పార్టీ అని చిలకపలుకులు పలుకుతోందని, ఇక్కడివారి బాధలు వారికి పట్టడంలేదని ఆయన విమర్శించారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలకు వచ్చిన రూ.9వేల కోట్ల నిధులు ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపించారు. తెలంగాణలో ఎస్టీలు 12శాతం ఉన్నారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అన్ని రంగాల్లో ఆమేరకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే సీఎం దళితుడేనని, ఉప ముఖ్యమంత్రి ముస్లిం అవుతారన్నారు. డిసెంబరు 31 తర్వాత తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఉద్యమాలు ఉప్పెనలా లేస్తాయని, భూకంపం సృష్టించైనా సాధించుకుంటామన్నారు.