అయోధ్యపై తీర్పు: వివాదాస్పద స్థలంలోనే రామజన్మ భూమి
లక్నో: అయోధ్య కేసులో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ గురువారం సాయంత్రం సంచలనాత్మకమైన, చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించారు. తీర్పుపై ముగ్గురు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మెజారిటీ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ప్రతినిధులు చెప్పారు. వివాదస్పదమైన స్థలం రామజన్మ భూమికి సంబంధించిందని కోర్టు నిర్ధారించినట్లు న్యాయవాదులు చెప్పారు. సున్నీ వక్ఫ్ బోర్డు పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. వివాదాస్పద స్థలం రామజన్మ భూమేనని, అక్కడి నుంచి రామ్ లాలా విగ్రహాలను తొలగించకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు న్యాయవాదులు చెప్పారు. అప్పీల్ కు కోర్టు 3 నెలల గడువు ఇచ్చింది. తీర్పును హైకోర్టు మూడు విభాగాలుగా వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా హైకోర్టు విభజించిది. మూడు స్థలాల్లో ఒకటి హిందపులకు, మరోటి ముస్లింలకు చెందినవని, మూడోది నిర్మోహి అఖాడాకు చెందిందని హైకోర్టు స్పష్టం చేసింది. రామ్ లాలా విగ్రహాలున్న స్థలం రాముడికి చెందిందని తీర్పు చెప్పింది. సీతా రసోయి, రామ్ చబుత్రా స్థలం నిర్మోహి అఖాడాకు చెందిందని తెలిపింది. మిగతా స్థలం సున్నీ వక్ఫ్ బోర్డుకు చెందిందని తీర్పు స్పష్టం చేసింది. మూడు నెలల పాటు యథాతథ స్థితి కొనసాగుతుంది. కాగా, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని సున్నీ వక్ఫ్ బోర్డు అంటోంది.
కోర్టు హాల్ కు చాలా దూరంగా మీడియాకు ఏర్పాట్లు చేశారు. ముగ్గురు న్యాయమూర్తులు తమ తీర్పు పాఠాలను చదివారు. కోర్టు హాల్ లో వ్యాజ్యాలు దాఖలు చేసిన 14 మంది, వారి న్యాయవాదులు ఉన్నారు. న్యాయమూర్తులు తీర్పు వెలువరించి బయటకు వెళ్లిపోయిన తర్వాతనే తీర్పు సారాంశం మీడియాకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేశారు. న్యాయమూర్తులు ఎస్ యు ఖాన్, సుధీర్ అగర్వాల్, డివి శర్మలతో కూడిన అలహాబాద్ హైకోర్టు లక్నో త్రిసభ్య బెంచ్ గురువారం సాయంత్రం తీర్పు వెలువరించారు. ముగ్గురు న్యాయమూర్తులు విడివిడిగా తమ తీర్పులు వెలువరించారు. గురువారం నాలుగున్నర ప్రాంతంలో తీర్పు ప్రతులు మీడియా చేతుల్లోకి వచ్చాయి. కోర్టు చుట్టూ వేయి మందితో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మొత్తం 13 వేల వాంగ్మూలాలను తీసుకున్నారు. 60 ఏళ్ల తర్వాత అయోధ్య కేసులో తీర్పు వెలువడింది. తీర్పు పాఠాన్ని కోర్టు ప్రతినిధులు చదివారు. సున్నీ బోర్డు పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. అన్ని అంశాలపై హైకోర్టు తీర్పు వెలువరించింది.
మీడియాకు, ప్రతివాదులకు మాత్రమే తీర్పు కాపీలను అందించారు. తీర్పుకు అన్వయాలు చేయవద్దని అంతకు ముందే జిల్లా కలెక్టర్ మీడియాను కోరారు. అందరూ సమన్వయంగా ఉండాలని, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడానికి వీలుటుందని యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ తీర్పునకు ముందు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయోధ్యలోని భూవివాదంపై ఐదు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిలో ఓ వ్యాజ్యాన్ని ఇది వరకే ఉపసంహరించుకున్నారు. మిగతా నాలుగు వ్యాజ్యాలపై కూడా తీర్పు వెలువడింది. ఐటి కంపెనీలకు సగం రోజు సెలవు ఇచ్చారు. బల్క్ ఎస్ఎంఎస్ లపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిషేధం విధించారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా అప్రమత్తమై ఉన్నాయి. తీర్పుపై సంయమనం పాటించాలని పార్టీలకు, మతాలకు అతీతంగా రాజకీయ నాయకులు, పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేసుతో సంబంధం ఉన్న న్యాయవాదులను తప్ప ఎవరూ లోనికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. లక్నోలో హెలికాప్టర్లతో గస్తీ ఏర్పాట్లు చేశారు. కోర్టు తీర్పును అంగీకరిస్తూ శాంతిసామరస్యాలను కాపాడాలని, సంయమనం పాటించాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, హోం మంత్రి పి. చిదంబరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.