తెలంగాణ ఫ్రజా ఫ్రంట్ ఆవిర్భావం, ఎవరికీ వ్యతిరేకం కాదు: గద్దర్
కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రంట్కు సారథ్యం వహించాల్సిందిగా అన్ని సంఘాలు, నాయకులు గద్దర్ను కోరారు. దీనికి ఆయన మొదట ఒప్పుకోలేదు. తనకు కొంత వ్యవధి కావాలన్నారు. ప్రజాఫ్రంట్ రూపం ఎలా ఉండాలి, కమిటీల ఎన్నిక, ఉద్యమ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 9తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ప్రజాఫ్రంట్కు కార్యవర్గాన్ని ఈ సందర్భంగానే ఏర్పాటు చేసుకుంటారు. గద్దర్ కూడా వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గే అవకాశం ఉంది. డిసెంబరులో 20వేల మంది కళాకారులతో ఒక భారీ సభను నిజాం కళాశాలలో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. కోదండరామ్ నేతృత్వం వహిస్తున్న రాజకీయ జెఎసితో తమకు సంబంధం లేదని గద్దర్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దీర్ఘకాలికంగా ఉద్యమం జరుగుతోందని, ఇది వ్యక్తుల చుట్టూ మాత్రమే ఉండకుండా సమష్టి నాయకత్వంలో ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజా ఉద్యమాన్ని సమన్వయం చేసే బాధ్యతను ఫ్రంట్ తీసుకుంటుందని గద్దర్ అన్నారు. డిసెంబర్ 9నాటి చిదంబరం ప్రకటన కూడా ఉద్యమ ఫలితమేనని, దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన తరుణంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పేరుతో వెనక్కు తీసుకెళ్లారని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయపార్టీలు పార్లమెంటుముందు తెలంగాణ బిల్లును పెట్టించ లేకపోయాయని, ఉద్యమాలతోనే తెలంగాణ వస్తుందనీ, రాష్ట్రాన్ని సాధించుకోవాలని ప్రజలకు వివరించి చెప్తామని గద్దర్ చెప్పారు. ఉద్యమ క్రమంలో వ్యక్తులు, సంస్థలు పుడుతూ ఉంటాయి- పోతూ ఉంటాయనీ, వాటికి విలువలేదన్నారు. తెలంగాణ అమరవీరుల ఆత్మకుశాంతి చేకూరాలంటే పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాల్సిందేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.