ఎంపి వైయస్ జగన్ ఓదార్పు యాత్రనే పిసిసి టార్గెట్
కాగా, వైయస్ జగన్ కు చెందిన నాయకులపై మరింత పెద్ద యెత్తున చర్యలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈ నెల 10వ తేదీన ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. 11వ తేదీన ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు సంబంధించి ఆయన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. తాను తొలగించాలనుకుంటున్న మంత్రుల జాబితాతో పాటు కొత్తగా తాను తీసుకోబోయే మంత్రుల జాబితాతో ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు పూర్తి మద్దతు ప్రకటించిన బాలినేని శ్రీనివాస రెడ్డికి ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. అలాగే, సబితా ఇంద్రారెడ్డి నుంచి హోం మంత్రిత్వ శాఖను తీసేసి మరో శాఖను ఆమెకు అప్పగిస్తారని చెబుతున్నారు.
ఈ నెలాఖరులోగా వైయస్ జగన్ గందరగోళానికి తెర వేయాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే పిసిసి క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.