కర్ణాటకలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భరద్వాజ్ సిఫార్సు?
కాగా, కర్ణాటక శాసనసభలో సోమవారం కనీవినీ ఎరుగని వాతావరణం నెలకొంది. సభ వాయిదా పడిన తర్వాత కూడా శాసనసభలో గందరగోళ వాతావరణం నెలకొని ఉంది. యెడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గిన తీరుపై కాంగ్రెసు, జెడిఎస్ శాసనసభ్యులు గవర్నర్ నివాసం ముందు ఆందోళనకు దిగారు. అనర్హత వేటు పడిన శాసనసభ్యులు కూడా రాజభవన్ ముందు ఆందోళనకు దిగారు. స్పీకర్ నిర్ణయాన్ని బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు సమర్థించారు. అసమ్మతి శాసనసభ్యులు చొక్కాలు చింపుకుని వచ్చారని ఆయన అన్నారు. అనర్హతకు అర్హత సాధించింది వారేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెసు, జెడి(ఎస్) విధ్వంసక పాత్ర పోషించాయని బిజెపి నేత నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
విశ్వాస పరీక్ష నెగ్గిన తీరును జెడిఎస్ నేత కుమారస్వామి తప్పు పట్టారు. అది రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని ఆయన విమర్శించారు. విశ్వాస తీర్మానం చట్టప్రకారం చెల్లదని ఆయన అన్నారు. యెడ్యూరప్ప ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన ఓట్లను స్పీకర్ లెక్కించి ఉండాల్సిందని ఆయన అన్నారు. శాసనసభ సమావేశమే జరగలేదని కాంగ్రెసు నాయకులు వ్యాఖ్యానించారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని వారన్నారు.