ఎమ్మెల్యేలపై కర్ణాటక స్పీకర్ వేసిన అనర్హహత వేటు చెల్లుతుందా?
స్పీకర్ స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ వ్యవస్థ అని, స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే, 16 మందిపై స్పీకర్ అనర్హత వేటు చెల్లుతుందా అనేది ప్రశ్న. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని స్పీకర్ బోపయ్య దుర్వినియోగం చేశారనే విమర్శ వినిపిస్తోంది. ఆ చట్టం రెండు సందర్భాల్లో మాత్రమే వర్తిస్తుందని అంటున్నారు. వాటిలో ఒకటి - శాసనసభ్యుడు తనంత తానుగా పార్టీ రాజీనామా చేసినప్పుడు, రెండోది - పార్టీ విప్ ను ధిక్కరించి ఓటు వేసినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని చెబుతున్నారు. ఈ రెండు సందర్భాలు లేకుండానే స్పీకర్ బోపయ్య 16 మందిపై వేటు వేశారని, అది చెల్లదని న్యాయనిపుణులు కొంత మంది అభిప్రాయపడుతున్నారు.
కాగా, తిరుగుబాటు శాసనసభ్యులు గవర్నర్ భరద్వాజ్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లేందుకు వారు సమాయత్తమవుతున్నారు. కర్ణాటక రాజకీయాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. గవర్నర్ ఆదేశాలను స్పీకర్ ధిక్కరించడాన్ని ఎలా తీసుకోవాలనే యోచనలో పడింది.