జగన్ ఆదాయంపై దుమ్మెత్తిపోస్తున్న అన్ని పార్టీల నాయకులు
కడప ఎంపీ వైఎస్ జగన్ ఆర్థిక వ్యవహార శైలి చూసి దేశంలోని ఆర్థిక వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలే తలలు పట్టుకుంటున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఒక్క ఏడాదిలోనే టాటా, బిర్లా, అంబానీ సోదరులను మించిపోయిన ఆస్తులతో ఆదాయ పన్ను శాఖకు రూ.84 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం అసాధారణ విషయమని, జగన్ ఆస్తులపై తక్షణమే అత్యున్నత ధర్మాసనం సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రోశయ్యను డిమాండ్ చేశారు. ప్రపంచమంతా ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ఇన్ని కోట్ల రూపాయల లాభాలు ఎలా సంపాదించారో తెలియజేయాలని కాంగ్రెసు అమలాపురం ఎంపీ హర్షకుమార్ కడప ఎంపీ జగన్ను ప్రశ్నించారు. జగన్ అడ్వాన్స్ ట్యాక్స్పై మంగళవారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి నిర్వహించిన చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జగన్ ఆ కిటుకు చెబితే ప్రపంచానికి మేలు చేసిన వారవుతారని అన్నారు.
ఆస్తుల సంపాదనకు ఆదాయ వనరులు ఏమిటో.. ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టారో కడప ఎంపీ వైఎస్ జగన్ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్రెడ్డి డిమాండ్ చేశారు. తన నివాసంలో మంగళవారం పాల్వాయి విలేకరులతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఇంత పెద్దమొత్తంలో అడ్వాన్సుగా చెల్లించడం ఐటీ శాఖకూ కేంద్ర ప్రభుత్వానికీ సవాల్గా పేర్కొన్నారు. అధిష్ఠానాన్ని జగన్ ధిక్కరించడానికి ఆదాయమే ప్రధాన కారణమని పాల్వాయి అన్నారు. తమకు వైఎస్పైన గౌరవం ఉందన్నారు. కాని, ఆయన హయాంలో కొంతమందితో కలసి చేసినవన్నీ ఇప్పుడు కుంభకోణాల రూపంలో బయట పడుతున్నాయని పాల్వాయి పేర్కొన్నారు. జగన్ ఇన్ని కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను చెల్లింపుపై విచారించాల్సి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కె.యాదవ్రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.