చంద్రబాబు పుత్రుడు లోకేష్ వ్యూహం: జగన్ సాక్షికి దీటుగా స్టూడియోఎన్
తన తండ్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్షిలో ఎడ తెగకుండా వ్యతిరేక వార్తాకథనాలు వస్తున్నాయి. దానికి దీటుగా లోకేష్ జగన్ పై వార్తాకథనాల రూపకల్పనకు వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బెంగళూర్ లోని జగన్ నివాస భవనంపై, జగన్ అస్తులపై వరుసగా వార్తాకథనాలు ప్రసారమయ్యాయి. అంతకు ముందు స్టూడియో ఎన్ కు పెద్దగా గుర్తింపు లేదు. జగన్ కు వ్యతిరేకంగా వార్తాకథనాలు ప్రసారం కావడంతో స్టూడియోఎన్ అందరి నోళ్లలో నానడం మొదలు పెట్టింది. కాంగ్రెసు నాయకులు స్టూడియోఎన్ పై విరుచుకుపడిన సందర్భాలు వచ్చాయి. స్టూడియోఎన్ ను చంద్రబాబు సమీప బంధువు నార్నే శ్రీనివాసరావు స్థాపించారు. దాన్ని సిఇవోగా లోకేష్ తన చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో దాని రూపురేఖలు మార్చేసే అవకాశం చంద్రబాబుకు దక్కిందని అంటున్నారు. చంద్రబాబు త్వరలో ఓ వార్తాపత్రికను కూడా పెట్టనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.