కాశ్మీర్ పై వ్యాఖ్యలకు అరుంధతీ రాయ్ పై దేశద్రోహం కేసు?
కాగా, కాశ్మీర్ హురియత్ సంస్థ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీపై దేశ ద్రోహం కేసు నమోదుకు కేంద్ర అంతర్గత వ్యవహారాల శాఖ అనుమతినిచ్చింది. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టే తీరులో వ్యాఖ్యానించిన గిలానీపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసేందుకు గాను ఢిల్లీ పోలీసులకు కేంద్ర అంతర్గత వ్యవహారాల శాఖ అనుమతినిచ్చింది. ఢిల్లీలో జరిగిన ఈ సదస్సులో ప్రముఖ రచయిత అరుంధతి రాయ్, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు పాల్గొన్నారు. ఈ సదస్సులో సయ్యద్ అలీ షా గిలానీ మాటలు వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని భారతీయ జనతా పార్టీతో పాటు విపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇంకా గిలానీపై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు.
భారత్ ఒకే దేశం కాదని, దేశాన్ని పలు భాగాలుగా విడగొట్టాలని వ్యాఖ్యానించిన గిలానీపై కఠిన చర్యలు తీసుకోవాలని జైట్లీ కోరారు. అతనిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్లు జైట్లీ ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారిని పోలీసులు అరెస్టు చేయాలని ఆయన సూచించారు. అయితే జైట్లీ ఆరోపణలను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఖండించారు. గిలానీ పాల్గొన్న సదస్సుకు చెందిన వీడియో అంతర్గత వ్యవహారాల శాఖ పరిశీలనలో ఉందని, చట్టప్రకారం ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో గిలానీపై చర్యలు తీసుకునేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయశాఖ పేర్కొంది. దీంతో కేంద్ర అంతర్గత వ్యవహారాల శాఖ గిలానీపై కేసు నమోదు చేసేందుకు అంగీకరించింది.