డిఎస్ కు ఢిల్లీ పదవా, రిటైర్మెంటా, మొయిలీ మాటలు ఉత్తవేనా?
పిసిసి అధ్యక్షుడి నియామకం ఏ ప్రాతిపదికపై జరగాలనే విషయంపై చర్చ సాగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలు, తెలంగాణ అంశంతో పీసీసీ అధ్యక్ష పదవి ముడిపడి ఉన్నందున సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని చెప్పాయి. అదే సమయంలో, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, పీసీసీకి కొత్త నేతను ఇప్పుడే నియమించాలా? లేక డిసెంబర్లో జరిగే ప్లీనరీలోపు నియమించాలా!? అన్న విషయంపైనా చర్చలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి గురువారమే ఒక స్పష్టత వస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎవరిని నియమించాలన్న విషయంపై ఒక స్పష్టత ఏర్పడితే ఈనెల 30వ తేదీలోపే పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని, లేకపోతే డిసెంబర్ 15 తర్వాతే పేరును ప్రకటించవచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. డీఎస్ స్థానంలో నియమించే నాయకుడు ఎవరికీ జంకకుండా, ఏ ప్రలోభాలకూ లొంగకుండా అధిష్ఠానానికి విధేయుడై, క్రమశిక్షణా రాహిత్యాన్ని అణిచేసే వ్యక్తి అయి ఉండాలని అధిష్ఠానం భావిస్తోంది. అదే సమయంలో, పీసీసీ అధ్యక్షుడి నియామకం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును మరింత బిగించాలని, భవిష్యత్తు పరిణామాలపై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది.