రక్త చరిత్ర-2లో చంద్రబాబు, వైయస్సార్ పాత్రలేమిటి?
అనంతపురం జిల్లాలో కాంగ్రెసును బలహీనపరుస్తూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయడానికి ప్రయత్నించిన పరిటాల రవి పట్ల చంద్రబాబు వైఖరి ఎలా ఉండేదని కూడా చిత్రీకరించే అవకాశాలున్నాయని అంటున్నారు. అధికార మార్పిడి సమయంలో పరిటాల రవి తొలుత స్వర్గీయ ఎన్టీ రామారావు వైపు ఉండి, ఆ తర్వాత చంద్రబాబు వైపు వచ్చారు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీని పటిష్టపరచడానికి పరిటాల రవిని ఆయన వాడుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసును బలోపేతం చేయడానికి అనుసరించిన రాజకీయాల్లోనే పరిటాల రవి హత్యకు గురయ్యాడని అంటారు. పరిటాల రవి ప్రాబల్యాన్ని తగ్గించడానికి వైయస్సార్ మద్దెలచెర్వు సూరిని వాడుకున్నట్లు కూడా చెబుతారు. ఈ నేపథ్యంలో రక్తచరిత్ర -2 పరిటాల రవి హత్య దాకా సాగుతుందనేది తెలిసి వచ్చే విషయమే. పరిటాల రవి హత్య కేసు విచారణలో ఉంది. హత్య కేసులో నిందితుడు మొద్దు శీను హత్యకు గురయ్యాడు. మరో నిందితుడు అప్రూవర్ గా మారాడు. వీటన్నింటికీ వర్మ తన సినిమాలో ఏ విధమైన అర్థం చెప్తారనేది ఆసక్తిగా మారింది. సినిమాలో అభ్యంతరకర దృశ్యాలు తొలగిస్తే పది నిమిషాలు కూడా మిగలదని, కల్పన ఎక్కువగా ఉందని తెలుగుదేశం శాసనసభ్యురాలు, పరిటాల రవి భార్య పరిటాల సునీత రక్తచరిత్ర -1పై ఇప్పటికే వ్యాఖ్యానించారు. ఈ స్థితిలో నవంబర్ 19వ తేదీన విడుదల కానున్న రక్తచరిత్ర -2 పై ఉత్కంఠ నెలకొంది.