పిసిసి పదవిపై ఆశ పడుతున్న వైయస్ జగన్ కు మొండిచెయ్యే?
పార్టీ అనుబంధ యువజన కాంగ్రెసు కమిటీలను రద్దు చేయడంపై వైయస్ జగన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ కు మద్దతిస్తుండడం వల్లనే వాటిని రద్దు చేశారని ఇప్పటికే జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు మండిపడ్డారు. యువజన కాంగ్రెసు కమిటీల పునర్నియామకం వ్యవహారం కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో జగన్ పై అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. జగన్ పై అభిప్రాయం అడుగుతూ ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారా, సానుకూలంగా ఉన్నారా అనే విషయాన్ని రాబడుతున్నారు. వ్యతిరేకంగా ఉన్నవారికి మాత్రమే స్థానం కల్పిస్తున్నట్లు సమాచారం. అనుకూలంగా ఉన్నవారిని పక్కన పెడుతున్నారని వినికిడి. ఈ వ్యవహారాన్ని బట్టి జగన్ పట్ల పార్టీ అధిష్టానం ఎంత వ్యతిరేకంగా ఉందో అర్థమవుతోందని అంటున్నారు. అందువల్ల పిసిసి అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ స్థానంలో జగన్ ను నియమించే అవకాశాలు ఎంత మాత్రం లేవని అంటున్నారు.